కోల్కతా: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 68) దుమ్మురేపాడు. 89/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కేకేఆర్ను దేవుడిలా ఆదుకున్నాడు. తన ట్యాగ్ లైన్ లార్డ్ శార్దూల్ ఠాకూర్ పేరును నిలబెట్టుకున్నాడు.
రింకూ సింగ్(33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 46)తో కలిసి 6వ వికెట్కు 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్వెల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు డేవిడ్ విల్లే కోలుకోలేని దెబ్బతీసాడు. వరుస బంతుల్లో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(3), మన్దీప్ సింగ్(0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో రెహ్మానుల్లా బౌండరీలు బాదడంతో కేకేఆర్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 47 పరుగులు చేసింది.
ఆ వెంటనే మైఖేల్ బ్రేస్వెల్ను రంగంలోకి దింపిన ఫాఫ్ డుప్లెసిస్ ఫలితం రాబట్టాడు. కెప్టెన్ నితీశ్ రాణా(1)ను బ్రేస్వెల్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్తో రెహ్మానుల్లా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న అతన్ని కర్ణ్ శర్మ ఔట్ చేశాడు.
వరుస బంతుల్లో రెహ్మానుల్లాతో పాటు డేంజరస్ ఆండ్రీ రస్సెల్(0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఆండ్రీ రస్సెల్.. విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్.. రింకూ సింగ్తో కలిసి అనూహ్యంగా చెలరేగాడు.

అసాధారణ బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా శార్దూల్.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రింకూ సింగ్ కూడా మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో రింకూ సింగ్ ఔటవ్వడంతో 6వ వికెట్కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి ఓవర్లో సిరాజ్ 12 పరుగులివ్వడంతో కేకేఆర్ 200 పరుగుల మార్క్ను అందుకుంది.