ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓటమిపాలైంది. వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.

శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/56), కామెరూన్ గ్రీన్(2/35) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/40), లాకీ ఫెర్గూసన్(1/47) తలో వికెట్ తీసారు.
పాపం కర్ణ్ శర్మ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 55), రజత్ పటీదార్(23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 3 ఫోర్లతో 24), కర్ణ్ శర్మ(7 బంతుల్లో 3 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు.
కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్(3/25) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అంపైర్ల తప్పిదం..
223 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 18) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. హర్షిత్ రాణా వేసిన హై ఫుల్ టాస్కు విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
కోహ్లీ క్రీజు బయట ఉండి ఆడడాని, బంతి డిప్ అయ్యిందని తెలిపి ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్(7)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయడంతో ఆర్సీబీ 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న రజత్ పటీదార్, విల్ జాక్స్..
ఈ పరిస్థితుల్లో రజత్ పటీదార్, విల్ జాక్స్ జట్టును ఆదుకున్నారు. 29 బంతుల్లో విల్ జాక్స్.. 21 బంతుల్లో రజత్ పటీదార్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. క్రీజులో సెట్ అయిన ఈ ఇద్దరిని ఆండ్రీ రస్సెల్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కామెరూన్ గ్రీన్(6) మరోసారి నిరాశపర్చగా.. అంపైర్ తప్పిదానికి మహిపాల్ లోమ్రోర్(4) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. సునీల్ నరైన్ స్టెప్ ఔట్ నోబాల్ వేయగా అంపైర్లు గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్ నిలకడగా ఆడారు. ధాటిగా ఆడుతున్న సుయాష్ ప్రభుదేశాయ్(24)ను హర్షిత్ రాణా ఔట్ చేయగా.. దినేశ్ కార్తీక్ భారీ షాట్లతో జట్టు స్కోర్ను 200 ధాటించాడు.

ఆఖరి ఓవర్లో హైడ్రామా
అయితే రస్సెల్ అతన్ని కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. కర్ణ్ శర్మ మూడు సిక్స్లతో ఆశలు రేకెత్తించాడు. దాంతో ఆర్సీబీ విజయానికి 2 బంతుల్లో 3 పరుగులు అవసరమవ్వగా.. రిటర్న్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో ఫెర్గూసన్ ఔటవ్వడంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.