ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా(3/29) తీన్మార్ బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులే చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 44) దూకుడుగా ఆడాడు.
అంగ్క్రిష్ రఘువంశీ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యాతో పాటు జోష్ హజెల్ వుడ్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, యశ్ దయాల్ తలో వికెట్ తీసారు. రహానే- నరైన్ ధాటికి ఓ దశలో కేకేఆర్ 220 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృనాల్ సంచలన బౌలింగ్తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు.

చెలరేగిన రహానే, నరైన్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ ఆదిలోనే ఓపెనర్ క్వింటన్ డికాక్(4) వికెట్ను కోల్పోయింది. జోష్ హజెల్ వుడ్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను సుయాశ్ శర్మ నేలపాలు చేశాడు. అయినా ఈ అవకాశాన్ని డికాక్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐదో బంతికి వికెట్ కీపర్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి రెండు ఓవర్లను కూడా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో 3 ఓవర్లలో కేకేఆర్ వికెట్ నష్టానికి 9 పరుగులే చేసింది. కానీ రసిఖ్ దార్ సలామ్ వేసిన నాలుగో ఓవర్లో రహానే రెండు సిక్స్లతో పాటు బౌండరీ బాది 16 పరుగులు పిండుకున్నాడు.
దాంతో స్పిన్నర్ అయిన కృనాల్ పాండ్యాను రజత్ పటీదార్ రంగంలోకి దింపగా.. నరైన్ ఓ సిక్స్.. రహానే రెండు బౌండరీలు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. యశ్ దయాల్ వేసిన 6వ ఓవర్లో రహానే రెండు ఫోర్లతో పాటు సిక్స్ కొట్టగా.. నరైన్ ఒక బౌండరీ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దాంతో పవర్ ప్లేలోనే కేకేఆర్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. 18 బంతుల్లో 51 పరుగులు రాబట్టింది.
మలుపు తిప్పిన కృనాల్..
పవర్ ప్లే అనంతరం కాస్త పరుగుల వేగం తగ్గగా.. సుయాశ్ శర్మ వేసిన 9వ ఓవర్లో రహానే సిక్స్ బాది 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో నరైన్ కూడా చెలరేగడంతో ఈ జోడీ 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. అయితే రసీఖ్ సలామ్ వేసిన ఆ మరుసటి బంతికే నరైన్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే రహానేను కృనాల్ పాండ్యా క్యాచ్ ఔట్ చేశాడు.
తన మరుసటి ఓవర్లలో వెంకటేశ్ అయ్యర్(6), రింకూ సింగ్(12)లను కృనాల్ క్లీన్ బౌల్డ్ చేసి ఆర్సీబీ బౌలర్లకు ఊపిరి అందించాడు. డేంజరస్ రస్సెల్(4)ను సుయాశ్ శర్మ ఔట్ చేయడంతో కేకేఆర్ పరుగుల వేగం తగ్గింది. ఆ తర్వాత బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యారు. దాంతో ఆ జట్టు 174 పరుగులకే పరిమితమైంది.