మిడిల్ ఓవర్లలో వరుసగా 2-3 వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 44) దూకుడుగా ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా(3/29), జోష్ హజెల్ వుడ్(2/22) కేకేఆర్ పతనాన్ని శాసించారు.
అనంతరం ఆర్సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్), ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. రహానే- నరైన్ ధాటికి ఓ దశలో కేకేఆర్ 220 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృనాల్ పాండ్యా సంచలన బౌలింగ్తో వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్కే పరిమితమైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రహానే.. మిడిలార్డర్, లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. '13వ ఓవర్ వరకు మా బ్యాటింగ్ బాగుందనే అనుకున్నాను. కానీ వరుసగా 2-3 వికెట్లు కోల్పోవడం మా మూమెంటమ్ను దెబ్బతీసింది. మా బ్యాటర్లు తమ అత్యుత్తమ షాట్లను ఆడే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. నేను, వెంకటేశ్ అయ్యర్ ఆడే సమయంలోనే 200-210 పరుగులు కూడా చేధించవచ్చని మాట్లాడుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం విజయవకాశాలను దెబ్బతీసింది.
డ్యూ కూడా కొంత ఫలితంపై ప్రభావం చూపింది. కానీ ఆర్సీబీ పవర్ ప్లేలో బ్యాట్తో సత్తా చాటింది. మా లక్ష్యం చిన్నది కావడంతో ఏం చేయలేకపోయాం. 200 ప్లస్ చేయాలనుకున్నాం. కానీ సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్ గురించి మేం ఎక్కువగా ఆలోచించం. కానీ మా తప్పిదాలపై ఫోకస్ పెడుతాం.'అని రహానే తెలిపాడు.