కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్తో రహానే ఈ ఫీట్ సాధించాడు. గత సీజన్లో కేకేఆర్ను నడిపించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్కు వెళ్లిపోయాడు. దాంతో కేకేఆర్ తమ నూతన సారథిగా రహానేను ప్రకటించింది.
తొలి మ్యాచ్లోనే రహానే అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి పాత రహానేను తలపించాడు. గతంలో రహానే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు సారథిగా వ్యవహరించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 24 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన రహానే.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున స్టీవ్ స్మిత్ డిప్యూటీగా ఒకే ఒక్క మ్యాచ్లో ఆ జట్టును నడిపించాడు. తాజా మ్యాచ్లో కేకేఆర్కు సారథ్యం వహించడంతో ఐపీఎల్లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు సారథ్యం వహించిన తొలి భారత ప్లేయర్గా రహానే నిలిచాడు.

రేసులో శ్రేయస్ అయ్యర్..
మరోవైపు రహానే తర్వాత మూడు వేర్వేరు జట్లకు సారథిగా వ్యవహరించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలవనున్నాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు కేకేఆర్, పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2018 నుంచి 2020 వరకు ఢిల్లీ సారథిగా వ్యవహరించిన అయ్యర్.. ఐపీఎల్ 2022లో కేకేఆర్కు వెళ్లాడు. రెండు సీజన్ల పాటు జట్టును నడిపించిన అతను గత సీజన్లో విజేతగా కూడా నిలబెట్టాడు.
తాజా సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆడే తొలి మ్యాచ్తో శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఫీట్ సాధించనున్నాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా అజింక్యా రహానే నిలిచాడు. అతన్ని కన్నా ముందు కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, స్టీట్ స్మిత్.. ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు సారథ్యం వహించారు.
మూడు ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్ల జాబితా:
1.కుమార సంగక్కర-పంజాబ్ కింగ్స్(13 మ్యాచ్లు), డెక్కన్ చార్జర్స్ (25 మ్యాచ్లు), సన్రైజర్స్ హైదరాబాద్(9)
2.మహేళ జయవర్దనే-పంజాబ్ కింగ్స్(1 మ్యాచ్), కొచ్చి టస్కర్స్ కేరళ (13 మ్యాచ్లు), ఢిల్లీ క్యాపిటల్స్(16)
3.స్టీవ్ స్మిత్-పుణే వారియర్స్ ఇండియా(1 మ్యాచ్), రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (15 మ్యాచ్లు), రాజస్థాన్ రాయల్స్(27)
4.అజింక్యా రహానే-రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్(1), రాజస్థాన్ రాయల్స్(24), కేకేఆర్(1*)
రహానే ఒక్కడే..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులే చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 44) దూకుడుగా ఆడాడు. అంగ్క్రిష్ రఘువంశీ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా(3/29)తో పాటు జోష్ హజెల్ వుడ్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, యశ్ దయాల్ తలో వికెట్ తీసారు.