
దుబాయ్: వెంకటేశ్ అయ్యర్(49 బంతుల్లో 9 ఫోర్లు సిక్స్తో 67) హాఫ్ సెంచరీతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ ముందు కోల్కతా నైట్రైడర్స్ 166 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. అయ్యర్ హాఫ్ సెంచరీకి అండగా రాహుల్ త్రిపాఠి(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34), నితీశ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/32) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. స్లాగ్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్కతా నైట్రైడర్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(7) అర్షదీప్ సింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి రాగా.. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ధాటిగా ఆడాడు. అతనికి జోడిగా రాహుల్ త్రిపాఠి సైతం బౌండరీలు బాదాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. స్కోర్ బోర్డు పరుగెత్తించింది. ఈ క్రమంలోనే వెంకటేశ్ అయ్యర్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రవి బిష్ణయో విడదీశాడు. రాహుల్ త్రిపాఠిని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో రెండో వికెట్కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే వెంకటేశ్ అయ్యర్ను బిష్ణోయ్ ఔట్ చేయగా.. ఆ మరుసటి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్(2)ను షమీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఓ వైపు వికెట్లు పోతున్నా మరోవైపు నితీశ్ రాణా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అర్షదీప్ వేసిన 18వ ఓవర్లో రాణా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ సీఫెర్ట్(2)ను షమీ రనౌట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి సునీల్ నరైన్(4 నాటౌట్) రాగా.. దినేశ్ కార్తీక్(11 ) చివరి బంతికి బౌల్డ్ అవ్వడంతో కేకేఆర్ 165 పరుగులకే పరిమితమైంది.