
పాపం అయ్యర్..
ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 9 ఫోర్లు సిక్స్తో 67) హాఫ్ సెంచరీకి తోడుగా రాహుల్ త్రిపాఠి(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34), నితీశ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/32) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 రన్స్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. మయాంక్ అగర్వాల్(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 40), షారుఖ్ ఖాన్ విలువైన పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ 2 వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, శివం మావి, వెంకటేశ్ అయ్యర్ తలో వికెట్ తీశారు. ఇక చివరి ఓవర్లో షారుఖ్ ఆడిన విన్నింగ్ షాట్.. త్రిపాఠి జారవిడిచాడు. ఆ క్యాచ్ కనుక పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

శుభారంభం..
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఓవైపు కేఎల్ రాహుల్ నిధానంగా ఆడినా మయాంక్ మాత్రం దూకుడు కనబర్చాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. ఇక క్రీజులో కుదురుకున్న ఈ జోడీని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన మయాంక్ అగర్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఓ భారీ సిక్సర్తో జోరు కనబర్చాడు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
అయితే వరుణ్ చక్రవర్తీ తన మరుసటి ఓవర్లో పూరన్(12)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి దెబ్బ తీశాడు. ఈ పరిస్థితుల్లో జట్టులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్(18).. రాహుల్కు సహకారం అందించాడు. ఈ క్రమంలోనే రాహుల్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుస ఓవర్లలలో మార్కరమ్, దీపక్ హుడా ఔటైనా.. షారుఖ్ ఖాన్(15 నాటౌట్)తో రాహుల్ మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లాడు. అయితే శివం మావి వేసిన 17వ ఓవర్ ఐదో బంతిని షారూఖ్ ఖాన్ భారీ సిక్స్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోవడం ఆ బంతిని బౌండరీలైన్ బయటి పడి సిక్స్గా మారింది. ఈ కష్టతరమైన క్యాచ్ డ్రాప్ కోల్కతా కొంపముంచింది. మ్యాచ్ మూమెంట్ పంజాబ్ వైపు మళ్లింది. ఆ క్యాచ్ పట్టుంటే ఫలితం మరోలా ఉండేది.

చేజార్చిన త్రిపాఠి
అయ్యర్ వేసిన ఆఖరి ఓవర్లో రాహుల్ సెకండ్ బాల్కు ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. పంజాబ్ విజయానికి చివరి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ మరుసటి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద రాహుల్ త్రిపాఠి క్యాచ్ అందుకున్నంత పని చేసి జార విడిచాడు. దాంతో అది సిక్స్గా మారి పంజాబ్ మూడు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. పరుగెత్తుకుంటూ వచ్చిన రాహుల్ త్రిపాఠి బంతిని సునాయసంగా అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ చేసుకోలేక జారవిడిచాడు.


Click it and Unblock the Notifications












