ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటింది. కోల్కతా నైట్రైడర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్రకెక్కింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 28) మెరుపులు మెరిపించారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
అదిరిపోయే ఆరంభం..
262 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు ప్రభుసిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దూకుడుగా ఆడుతున్న అతన్ని సునీల్ నరైన్ సూపర్ త్రో సాయంతో రనౌట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన రీలో రోసౌ(26)తో కలిసి జానీ బెయిర్ స్టో చెలరేగాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సునీల్ నరైన్ విడదీసాడు.
జానీ బెయిర్ స్టో సెంచరీ..
రీలీ రోసౌ(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 26)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ సాయంతో జానీ బెయిర్ స్టో.. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే శశాంక్ సింగ్ సైతం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 9 పరుగులు అవసమరమయ్యాయి. రమణ్దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో శశాంక్ సింగ్ సిక్స్ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.