చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేజింగ్కు మొగ్గుచూపాడు. పిచ్ గత మ్యాచ్ మాదిరే ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అయితే ఎలాంటి మార్పుల్లేకుండా గత మ్యాచ్ విన్నింగ్ టీమ్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తమకు కూడా చేజింగ్ చేయాలనే ఉందన్నాడు. గత రెండు మ్యాచ్లు చూసిన తర్వాత డ్యూ కీలక ప్రాత పోషిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందన్నాడు. గత మ్యాచ్ మాదిరి కాకుండా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తామన్నాడు. ఇక క్రిస్ లిన్ స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. గత మ్యాచ్లో క్రిస్ లిన్ రాణించినా.. రోహిత్ రనౌట్కు కారణమవ్వడంతో అతనిపై వేటు పడింది. ఈ విషయాన్ని లిన్ కూడా గత మ్యాచ్ అనంతరమే అంగీకరించాడు.
కోల్కతా ఆడిన మొదటి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్పై 10 పరుగుల తేడాతో గెలిచి మంచి ఉత్సాహంతో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన ముంబై టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్ల ముఖా ముఖి పోరు పరిశీలిస్తే రెండు జట్లు 27 మ్యాచ్ల్లో తలపడగా.. ముంబై 21 మ్యాచ్ల్లో గెలుపొందింది. కోల్కతా మాత్రం కేవలం 6 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, మార్కో జాన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
కోల్కతా నైట్రైడర్స్: నితీష్ రాణా, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.