ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్కు మొగ్గు చూపాడు. మైదాన పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత రెండు రోజులుగా మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఇక్కడి రికార్డులపై మాకు అవగాహన ఉంది. గణంకాలు ఎలా ఉన్నా గుడ్ క్రికెట్ ఆడితేనే విజయం దక్కుతుంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మరోసారి టాస్ ఓడిపోయాను. టాస్ ఓడిపోవడంలో నాది రికార్డ్ అనుకుంటా. అయితే ఇవన్నీ ఆటలో సహజమే. కానీ కీలక మ్యాచ్ల్లో టాస్ గెలవడం ముఖ్యం. అయితే టాస్ ఓడిపోవడాన్ని సాకుగా చెప్పాలనుకోవడం లేదు. అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకోవడం మా లక్ష్యం. రఘువంశీ స్థానంలో నితీష్ రాణా తుది జట్టులోకి వచ్చాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణ్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, అన్షుల్ కంబోజ్, పియూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా