కోల్కతా: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. టాపార్డర్ విఫలమైనా.. నికోలస్ పూరన్(30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 58) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. పూరన్కు తోడుగా ఆయుష్ బదోని(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) రాణించాడు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కరణ్ శర్మ(3)ను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్తో కలిసి క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్ను ముందుకు నడపించాడు. దాంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది.
వైభవ్ అరోరా వేసిన ఏడో ఓవర్లో ప్రేరక్ మన్కడ్(26)తో పాటు మార్కస్ స్టోయినీస్(0)ను పెవిలియన్ చేర్చాడు. సూపర్ బౌలింగ్తో బంతి వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు తీసాడు. ఆ వెంటనే కృనాల్ పాండ్యా(9)ను సునీల్ నరైన్ ఔట్ చేయగా.. క్వింటన్ డికాక్(28)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో ఆయూష్ బదోనితో కలిసి నికోలస్ పూరన్ జట్టును ఆదుకున్నాడు. భారీ సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బదోని కూడా మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ గాడిన పడింది. 6వ వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం ఆయూష్ బదోని ఔటవ్వగా.. శార్దూల్ వేసిన 19వ ఓవర్లో నికోలస్ పూరన్ భారీ సిక్సర్లతో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ కాగా.. రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్లో కృష్ణప్ప గౌతమ్ 6, 4 బాది జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.