కోల్కతా: ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును విరాట్ కోహ్లీ అభిమానుల వెంటాడి వేధిస్తున్నారు. ప్రత్యర్థి ఏదైనా, వేదిక మారినా.. కోహ్లీ అభిమానులు మాత్రం తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో బోల్డ్, నట్లు విసిరేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా కోల్కతా వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ నినాదాలతో తమ నిరసనను తెలియజేశారు.
కోహ్లీ అభిమానుల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ ఉల్ హక్.. వారిని మరోసారి గెలికాడు. మళ్లీ గప్ చుప్ అని సైగలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వాడు. కోహ్లీ నినాదాలను తట్టుకోలేకపోయిన నవీన్ ఉల్ హక్.. అవకాశం కోసం ఎదురు చూసి తమ మెంటార్ గౌతమ్ గంభీర్ తరహాలో నోటిపై వేలు వేసుకొని గమ్మునుండాలని ఫ్యాన్స్కు సూచించాడు.

కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా యశ్ థాకూర్ వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి రెహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ క్యాచ్ అందుకున్న నవీన్ ఉల్ హక్.. అభిమానుల వైపు సైలెంట్గా ఉండాలని సైగ చేశాడు. నవీన్ ఉల్ హక్ చేసిన పనితో మరింత ఆగ్రహానికి గురైన అభిమానులు.. కోహ్లీ కోహ్లీ అంటూ మరింత గట్టిగా అరుస్తున్నారు. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ మైదానం కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ, నవీన్ ఉల్ హక్ గొడవ పడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేసే సమయంలో నవీన్ ఉల్ హక్.. పిచ్పైకి పదే పదే వస్తున్నాడని కోహ్లీపై అంపైర్కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆగ్రహానికి గురైన కోహ్లీ.. తాను పిచ్పై పరుగెత్త లేదని, తన కాలి మట్టిని చూస్తే ఈ విషయం అర్థమవుతుందని అంపైర్కు వివరణ ఇచ్చాడు.
విజయానంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో కోహ్లీ ఏదో చెప్పబోతుండగా నవీన్ ఉల్ హక్ చేతిని లాగేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆగ్రహానికి గురైన కోహ్లీ అతనిపై నోరుపారేసుకున్నాడు. ఈ క్రమంలోనే లక్నో మెంటార్ గంభీర్.. కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్ర దుమారం రేపింది. మ్యాచ్ రిఫరీ 100 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ చర్యలు తీసుకున్నాడు.
ఆ తర్వాత ఓ మ్యాచ్లో కోహ్లీ ఔట్ను నవీన్ ఉల్ హక్ ట్రోల్ చేశాడు. అప్పటి నుంచి నవీన్ ఉల్ హక్, లక్నో టీమ్ను కోహ్లీ అభిమానులు ద్వేషిస్తున్నారు.