
పుణే: ఐపీఎల్ 2022 సీజన్లో నయా టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా నైట్రైడర్స్తో శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన లక్నో.. 75 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. ఈ భారీ గెలుపుతో రన్రేట్ను మెరుగుపరుచుకున్న లక్నో.. పాయిట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
మరోవైపు ఈ ఘోర పరాజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్లకు మూడు గెలిచినా ఆ జట్టు ముందడుగు వేయలేని పరిస్థితి తెచ్చుకుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న ఆ జట్టు.. చివరి మూడు గెలిచినా 14 పాయింట్లకే పరిమితమవుతుంది. కొత్తగా రెండు జట్లు వచ్చిన నేపథ్యంలో కనీసం 6 జట్లు 16 పాయింట్లు, అంతకన్నా ఎక్కువ సాధించే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దీపక్ హుడా(41), కృనాల్ పాండ్యా(25), మార్కస్ స్టోయినీస్ (28) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథి, శివమ్ మావి, సునీల్ నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. జాసన్ హోల్డర్(3/31),ఆవేశ్ ఖాన్(3/19) తీన్మార్ వేయడంతో కేకేఆర్ బేజార్ అయింది. ఈ ఇద్దరికి తోడుగా మోహ్సిన్ ఖాన్, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు. కేకేఆర్ జట్టులో ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 45), సునీల్ నరైన్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) మినహా అంతా విఫలమయ్యారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. బాబా ఇంద్రజీత్(0)తో పాటు, శ్రేయస్ అయ్యర్ (6), ఆరోన్ ఫించ్(14), నితీశ్ రాణా(2) వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. సునీల్ నరైన్(22) సాయంతో ఆండ్రీ రస్సెల్ 5 సిక్సర్లతో గట్టెక్కించే ప్రయత్నం చేసినా ఆవేశ్ ఖాన్ దెబ్బతీసాడు. ఈ ఇద్దరిని పెవిలియన్ చేర్చి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్గా వెనుదిరిగారు.