కోల్కతా: సొంత దేశం కంటే కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీనే తనకు ఎక్కువని ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ అన్నాడు. తనకు గాయమైనప్పుడు కేకేఆర్ స్పెషల్ కేర్ తీసుకుందని చెప్పాడు. శనివారం జన్మదినం జరుపుకున్న రస్సెల్.. అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రసారం చేసింది.
ఈ వీడియోలో రస్సెల్.. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్మేనేజ్మెంట్పై ప్రశంసల జల్లు కురిపించాడు. కేకేఆర్ మేనేజ్మెంట్ తనను సొంత మనిషిలా చూసుకుందని, మోకాలికి గాయమైనప్పుడు స్పెషల్ కేర్ తీసుకుందని వివరించాడు. తన సొంత దేశం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా అలా చూసుకోలేదని చెప్పాడు.

'నాకు కొన్నేళ్ల క్రితం మోకాలికి గాయమైంది. అప్పుడు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ నామీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. నా ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చును పూర్తిగా భరించింది. అది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. నాకు తెలిసి ఏ ఇతర ఫ్రాంచైజీ గానీ, నా సొంత దేశ క్రికెట్ బోర్డు కూడా నా మీద ఇంత ఖర్చు చేయలేదు. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అసలు ఇన్నేళ్ల నా ఐపీఎల్ కెరీర్లో నేను ఫ్రాంచైజీ మారాలన్న ఆలోచన కూడా రాలేదు.
నేను కేకేఆర్ తో 9 సీజన్లు ఆడాను. ఇది పదో సీజన్. ఇక్కడ నా మనసుకు నచ్చినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ అంటే చాలా ఇష్టం. ఆయనను గౌరవిస్తాను. ఐపీఎల్ సీజన్ లేకున్నా నేను మాములు టైమ్ లో కూడా వారిని కలుస్తుంటా. ఈ టీమ్ లో ఉండే ఆటగాళ్లతో కూడా నాకు మంచి సంబంధాలున్నాయి.'అని చెప్పుకొచ్చాడు.
2014 నుంచి కేకేఆర్కు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్.. ఇప్పటివరకు 106 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 90 ఇన్నింగ్స్ల్లో 2,143 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మాత్రం 8 మ్యాచ్ల్లో 108 పరుగులే చేసాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రస్సెల్( 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) మెరుపులు మెరిపించిన కేకేఆర్కు ఓటమి తప్పలేదు.