
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ సూపర్ క్యాచ్కు క్రీజును వీడిన బ్యాట్స్మన్ను అంపైర్ మళ్లీ బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్ నాలుగో బంతిని షిమ్రన్ హెట్మైర్ మోకాలిపై కూర్చొని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే ఆ దిశలో బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్.. ముందుకు పరిగెత్తి సూపర్ డైవ్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దాంతో హెట్మైర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.
గిల్ సూపర్ క్యాచ్ పట్టినప్పటికీ వరుణ్ వేసిన బంతి నోబాల్గా సందేహం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. టీవీ రీప్లేలో పలుమార్లు పరిశీలించగా.. చాలా క్లోజ్గా వరుణ్ ఫ్రంట్ ఫూట్ లైన్ ధాటినట్లు అనిపించింది. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మన్ కింద అంపైర్ నోబాల్ ఇవ్వడంతో కేకేఆర్కు నిరాశ మిగిలింది. సూపర్ క్యాచ్ అందుకున్న శుభ్మన్ గిల్ ఎఫర్ట్ వృథా అయింది. ఇక ఔటనుకొని మైదానం వీడిన హెట్మైర్ను రిజర్వ్ అంపైర్ అనిల్ చౌదరి బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దాంతో సంతోషంగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన హెట్మైర్ ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. అయితే సునీల్ నరైన్ వేసిన 19వ ఓవర్లో హెట్మైర్ రనౌటవ్వడంతో కేకేఆర్ ఊపిరి పీల్చుకుంది.
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(31 బ్యాటింగ్), శుభ్మన్ గిల్(17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కేకేఆర్ విజయానికి 84 బంతుల్లో 85 పరుగులు కావాలి.