బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. బౌలర్లకు కావాల్సిన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని తెలిపాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడాన్ని కూడా సమర్థించుకున్నాడు.

'ముందు బ్యాటింగ్ చేయడం చాలా మంచి ఆప్షన్. అయితే బ్యాటింగ్ యూనిట్గా మేం దారుణంగా విఫలమయ్యాం. 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ. అయితే మా తప్పిదాల నుంచి మేం పాఠాలు నేర్చుకుంటాం. ప్రతీ రోజు మనది కాదు.
మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 5 మ్యాచ్ల్లో కనీసం నాలుగు గెలవాలి. సమష్టి ప్రదర్శనతో ఈ సవాల్ను అధిగమిస్తాం. అయితే ఈ పిచ్పై మేం 180-200 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేది. మా బౌలర్లకు మేం పోరాడే లక్ష్యాన్ని ఇవ్వలేకపోయాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. రిషభ్ పంత్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27), కుల్దీప్ యాదవ్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 34 నాటౌట్)టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/16) తీన్మార్ బౌలింగ్కు వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/27) రెండేసి వికెట్లతో చెలరేగారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలుపొందింది. ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26 నాటౌట్)విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, లిజార్డ్ విలయమ్స్ ఓ వికెట్ తీసారు.