ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ మరో విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది.
రిషభ్ పంత్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27), కుల్దీప్ యాదవ్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 34 నాటౌట్)టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/16) తీన్మార్ బౌలింగ్కు వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/27) రెండేసి వికెట్లతో చెలరేగారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలుపొందింది. ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26 నాటౌట్)విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, లిజార్డ్ విలయమ్స్ ఓ వికెట్ తీసారు.
154 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్(15) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. సునీల్ నరైన్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. సాల్ట్ విధ్వంసంతో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది.

అనంతరం అక్షర్ పటేల్ వేసిన తొలి బంతికే సునీల్ నరైన్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రింకూ సింగ్(11)ను విలియమ్స్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఆచుతూచి ఆడాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ.. 21 బంతులు మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.