ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. గత రెండు మ్యాచ్ల్లో మేం ముందుగా బ్యాటింగ్ చేసి విజయం సాధించాం. మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించకుండా ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలనుకుంటున్నాం.
గత మ్యాచ్తో చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఈ మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా సిద్దంగా ఉన్నారు. హోరాహోరీ మ్యాచ్ల్లో ఓడినా.. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మేం విజయం కోసం మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చాడు.'అని రహానే చెప్పుకొచ్చాడు.

మరోవైపు ఈడెన్ గార్డెన్స్ తనకు హోమ్ గ్రౌండ్లాంటిదని ధోనీ తెలిపాడు. ఈ మైదానంలోనే తాను క్రికెటర్గా ఎదిగానని చెప్పాడు. ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడానని తెలిపాడు. 'ఈడెన్ గార్డెన్స్ నాకు హోమ్ గ్రౌండ్లాంటిది. జోనల్ ట్రోఫీ, ఆఫీస్ లీగ్స్ పేరిట ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడాను. ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. వచ్చే సీజన్ కోసం మా జట్టుపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నాం. మా మిడిలార్డ్ బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నాం. మా ఆటగాళ్లందరికి అవకాశం ఇస్తున్నాం. కానీ మాకు అత్యుత్తమ తుది జట్టు కావాలి.
ఈ టోర్నీ ముగిసే సవరకు ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. ఏ ప్లేయర్ ఏ స్థానంలో సెట్ అవుతాడో పరిశీలిస్తాం. కేకేఆర్లో ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ మాకు సవాల్గా ఉంటుంది. కాన్వే, ఉర్విల్ పటేల్ తుది జట్టులోకి వచ్చారు. షేక్ రషీద్, సామ్ కరణ్ ఉద్వాసనకు గురయ్యారు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. తెలుగు తేజం షేక్ రషీద్ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో అతనిపై వేటు పడింది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, అశ్విన్, ధోనీ (కెప్టెన్, కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ.
కేకేఆర్: రహమానుల్లా గుర్బాజ్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్ క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.