కోల్కతా: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అజింక్యా రహానే(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 71), డేవాన్ కాన్వే(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 56), శివమ్ దూబే(21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. కేకేఆర్ బౌలర్లలో కుల్వాంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

అదిరిపోయే ఆరంభం..:టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35), డెవాన్ కాన్వే అదరిపోయే ఆరంభాన్ని అందించారు. సూపర్ బ్యాటింగ్తో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ.. పవర్ ప్లేలోనే 59 పరుగులు చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సుయాశ్ శర్మ విడదీసాడు. రుతురాజ్ గైక్వాడ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
చెలరేగిన రహానే, దూబే..:క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానేతో డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో డేవాన్ కాన్వే 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో కాన్వేకు ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. హాఫ్ సెంచరీ ముగిసిన వెంటనే డెవాన్ కాన్వేను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన శివమ్ ధూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
రహానే కూడా భారీ షాట్లు ఆడి 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. శివమ్ ధూబే 20 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం శివమ్ దూబే కుల్వాంత్ ఖేజ్రోలియా బౌలింగ్లో క్యాచ్ ఔటైనా.. జడేజాతో కలిసి రహానే చెలరేగాడు. దాంతో చెన్నై 18.1 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్ను అందుకుంది.
వరుణ్ చక్రవర్తీ వేసిన 19వ ఓవర్లో రహానే 6,6, 4 బాది 19 పరుగులు పిండుకోగా.. చివరి ఓవర్లో జడేజా(18) రెండు సిక్స్లు బాది ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ధోనీ రెండు పరుగులు చేయడంతో చెన్నై 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.