
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారత్ను ఆదుకునేందుకు కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ. 37.40 లక్షలు(50వేల డాలర్ల)ను ప్రధానమంత్రి సహాయనిధి పీఎం కేర్స్కు విరాళంగా ప్రకటించాడు. తన సహచర ఐపీఎల్ ఆటగాళ్లకు కూడా తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చాడు. కరోనా కేసుల విజృంభణతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో ఆసుపత్రుల్లో బెడ్స్ లేక చాలా మంది బాధితులు అవస్థలు పడుతున్నారు. వీటిని చూసి చలించిపోయిన ప్యాట్ కమిన్స్.. తనవంతు సాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు కమిన్స్ ట్విటర్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశాడు.
తనది చిరుసాయమే అయినా బాధితులకు ఎంతో కొంత ఉపయోగపడితే చాలన్నాడు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన విరాళాన్ని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సరియైనదా? కాదా? అనే చర్చ జరుగుతోంది. కానీ లాక్డౌన్లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీఎల్ మ్యాచ్లు కాస్త సంతోషానిస్తాయని కమిన్స్ పేర్కొన్నాడు. రికార్డుస్థాయి కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్ కాస్త ఉపశమనాన్ని ఇస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తను సూచించదల్చుకున్నానని తెలిపాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ కోల్కోతా కోట్ల ఆటగాడు.. సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తనదైన సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి కమిన్స్.. జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. కేవలం 34 బంతుల్లోనే 66 రన్స్ చేసి ప్రత్యర్థి వెన్నులో వణుకు తెప్పించాడు. కానీ సహచరుల నుంచి సాయం లభించకపోవడంతో జట్టుకు విజయాన్నందించలేకపోయాడు.