
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి వెస్టిండీస్ ఆల్రౌండర్, కోల్కతా నైట్రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్మన్ ఆండ్రూ రస్సెల్ కృతజ్ఞతలు తెలిపాడు. జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్ను అందించడం పట్ల ఈ విండీస్ క్రికెటర్ హర్షం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను జమైకాలోని భారత రాయబార కార్యలయం ట్విటర్ వేదికగా పంచుకుంది.
'ప్రధాని నరేంద్ర మోదీకి, భారత హై కమిషన్కు నా కృతజ్ఞతలు. వ్యాక్సిన్లు వచ్చేశాయి. మేమంతా చాలా ఉత్సాహంతో ఉన్నాం. ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటే చూడాలని ఆశిస్తున్నా. భారత్, జమైకా ఎల్లపుడూ మంచి మిత్రులు, సోదరులు. మీరంతా అక్కడ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా.'అని ఆ వీడియోలో రస్సెల్ చెప్పుకొచ్చాడు.
50 వేల వ్యాక్సిన్లు పంపడం పట్ల ఈ నెల ప్రారంభంలో భారత్కు జమైకా కృతజ్ఞతలు తెలిపింది. "భారత ప్రభుత్వం పంపించిన 50 వేల ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్లు జమైకా చేరుకున్నాయని తెలపడానికి సంతోషిస్తున్నా. అవసరం ఉన్న సమయంలో మాకు సాయం చేసిన భారత ప్రభుత్వం, ప్రజలకు మా ప్రేమను తెలియజేస్తున్నా" అంటూ ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ట్వీట్ చేశారు.
వ్యాక్సిన్ మైత్రీలో భాగంగా కరేబియన్ దేశాలకు వ్యాక్సిన్ అందిస్తున్న భారత్కు వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడామ్స్, రామ్నరేశ్ సర్వాన్ ధన్యవాదాలు తెలిపాడు. ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. ఈ నెలలో 1,75 వేల కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్లను కరేబియన్ దేశాలు అందుకోగా.. ఇందులో 40వేల వరకు ఒక్క భారతే అందించింది.