న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) లీగ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రపంచానికి పరిచయమయ్యారు. కూటికి గతిలేని నిరూపేద ఆటగాళ్లు కూడా ఈ లీగ్ ద్వారా కోటీశ్వరులుగా మారడమే కాకుండా ఛాంపియన్ ప్లేయర్లుగా గుర్తింపు పొందారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కృనాల్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ ఇలానే వరల్డ్ బెస్ట్ క్రికెటర్లుగా ఎదిగారు.
తాజా సీజన్తో కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాది ఓవర్నైట్ స్టార్గా మారాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించిన ఈ ఉత్తర ప్రదేశ్ కుర్రాడు.. పంజాబ్తో ఆఖరి బంతికి బౌండరీ బాది కేకేఆర్ను గెలిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో బిగ్ హిట్టింగ్తో కేకేఆర్ను గెలిపించినంత పని చేశాడు.

గత నాలుగేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రింకూ సింగ్.. ఈ సీజన్తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అసాధారణమైన ఆటతో టీమిండియాను ఎంపిక చేయాలని ప్రతీ ఒక్కరు మాట్లాడేలా మన్నన్నలు పొందాడు. తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు వచ్చి ఫేమ్ అంతా టెంపరరీ మాత్రమేననే విషయం తనకు బాగా తెలుసన్నాడు.
ఇప్పుడు పొగుడుతున్న వారే.. తాను బాగా ఆడకుంటే తిడతారని తెలిపాడు. చాలా మందికి తన సక్సెస్ మాత్రమే తెలుసని, తాను పడ్డ కష్టం తెలియదన్నాడు.
'నేను గతంలో ఎలా ఆడానో ఇప్పుడు అలానే ఆడుతున్నా. కానీ చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్లు కొట్టి విజయాన్నందించడంతో అందరి దృష్టి నాపై పడింది. ఈ ఇన్నింగ్స్ నా జీవితాన్నే మార్చేసింది. అంతకుముందు నేను చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఐదు సిక్సర్ల తర్వాత నా పేరు చాలా మందికి తెలిసింది. ఈడెన్ గార్డెన్స్లో ప్రేక్షకులు రింకూ రింకూ అని అరవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి.
అయితే ఇదంతా రెండు నిమిషాల ఫేమ్ మాత్రమే. దీన్ని నేను ఏ మాత్రం తలకు ఎక్కించుకోను. ఎందుకంటే నేను పడ్డ కష్టం నాకు మాత్రమె తెలుసు. ఇప్పుడు పొగుడుతున్నవారే రేపు బాగా ఆడకుంటే తిట్టని తిట్టు తిడుతారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను పెద్దగా చదువుకుంది కూడా ఏం లేదు.
మా కుటుంబం గడవడానికి మా అమ్మ నన్ను స్వీపర్గా పనిచేయమంది. ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను బయటపడేంది క్రికెట్ ఒక్కటే. అందుకు నాకిష్టమైన ఆటకోసం ఎంతటి హార్డ్ వర్క్ చేసేందుకు అయినా నేను సిద్దం. నా క్రికెట్ ప్రయాణంలో చాలా మంది చాలా రకాలుగా సాయం చేశారు. గత కొంతకాలంగా కేకేఆర్ నాకు అండగా నిలిచింది. దాంతోనే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.