బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ ఆదేశించిన నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) స్పందించింది. బీసీసీఐ మాటే తమ వేదమని, ఇప్పటికే ముస్తాఫిజుర్ను రిలీజ్ చేసే ప్రక్రియ పూర్తయిందని తెలిపింది.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడకుండా ముస్తాఫిజుర్పై నిషేధం విధించాలని దేశవ్యాప్తండా డిమాండ్ వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీలు సైతం ముస్తాఫిజుర్ను వదిలేయాలని కేకేఆర్ను బహిరంగంగా హెచ్చరించాయి. ఈ క్రమంలోనే అతన్ని జట్టు నుంచి వదిలేయాలని కేకేఆర్కు బీసీసీఐ సూచించింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియానే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. దేశ ప్రజల డిమాండ్, రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ముందుగా ఈ విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబించినప్పటికీ.. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 'ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను విడుదల చేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. అతని స్థానంలో కేకేఆర్ మరో ప్రత్యామ్నాయ ఆటగాడిని కోరుకుంటే.. అందుకు బీసీసీఐ అనమతి ఇస్తుంది.'అని ఏఎన్ఐతో సైకియా అన్నారు.
కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఫ్రాంచైజీ సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. 'అప్కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్కు ముందే మా జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను రిలీజ్ చేయాలని బీసీసీఐ మాకు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ సూచనల మేరకు, తగిన సంప్రదింపుల తర్వాత నిబంధనల ప్రకారమే ఈ విడుదల ప్రక్రియను పూర్తి చేశాం. ఐపీఎల్ రూల్స్కు అనుగుణంగా.. ముస్తాఫిజుర్ స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవడానికి బీసీసీఐ... కేకేఆర్కు అనుమతి ఇచ్చింది. రిప్లేస్మెంట్కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం.'అని కేకేఆర్ మేనేజ్మెంట్ తమ ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కేకేఆర్ రూ.9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడి మరీ భారీ ధరకు దక్కించుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లా ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు. కానీ బంగ్లాదేశ్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ ముస్తాఫిజుర్ సేవలను కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఆ జట్టకు తీవ్ర నష్టం చేయనుంది.