ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న హార్దిక్ సేన.. శనివారం కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 16 ఓవర్లకు కుదించగా.. సమష్టిగా రాణించిన కేకేఆర్ 18 పరుగుల తేడాతో తేడాతో గెలుపొందింది.
ఇషాన్ కిషన్(22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40), తిలక్ వర్మ(17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32) రాణించినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో రాణించాల్సిన హార్దిక్ పాండ్యా(2).. దారుణంగా విఫలమవ్వడం ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా,అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంది. ఈ ఏడాది ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్న తొలి జట్టుగా కేకేఆర్ గుర్తింపు పొందింది.
శుభారంభం దక్కినా..
158 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(19) శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. దాంతో ముంబై పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. అనంతరం శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. ఓపెనర్లు ఇద్దరిని వరస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు.
హాఫ్ సెంచరీకి చేరువైన ఇషాన్ కిషన్(40)ను నరైన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(9)ను ఆండ్రీ రస్సెల్ వెనక్కిపంపాడు. దాంతో 87 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా(2), టీమ్ డేవిడ్(0), నెహాల్ వధేరా(3) విఫలమవ్వగా.. తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. దూకుడుగా ఆడిన నమన్ ధిర్(17),తిలక్ వర్మ(32)ను హర్షిత్ రాణా ఒకే ఓవర్లో ఔట్ చేసి కేకేఆర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.