WTC Final: టీమిండియాలో అతనే కీలకం!

ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ మరోసారి కీలకమవుతాడని మాజీ క్రికెటర్ కిరణ్ మోరె అన్నాడు. ప్రస్తుతం అతను అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. బ్యాటింగే కాకుండా కీపింగ్లోనూ పరిణతి కనబరుస్తున్నాడని ప్రశంసించాడు.
జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఫైనల్ అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య ఇంగ్లండ్తో కోహ్లీ సేన 5 టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మోరె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పంతే మళ్లీ కీలకం..
'వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో రిషభ్ పంత్ మరోసారి కీలకమవుతాడనిపిస్తోంది. అతని ఫామ్ను చూస్తుంటే.. ఎప్పుడైనా, ఏ స్థానంలోనైనా ఆటను మలుపు తిప్పగలడన్న ఆత్మవిశ్వాసం అతనిలో కనిపిస్తోంది. పంత్ ఇప్పుడు చక్కగా కుదురుకున్నట్టు అనిపిస్తోంది. అతను ఇంగ్లండ్లో పర్యటించడం ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం మూడోది. అక్కడి పరిస్థితులు అతనికి బాగా తెలుసు. ఇంగ్లండ్లో అతను టెస్టు సెంచరీ నమోదు చేశాడు. గ్లోవ్స్తోనూ అతడు మాయాజాలం సృష్టించగలడనిపిస్తోంది' అని కిరణ్ మోరె విశ్వాసం వ్యక్తం చేశాడు.

న్యూజిలాండ్కు అడ్వాంటేజ్..
ఇక ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో ఆడుతున్న రెండు టెస్ట్ల సిరీస్ న్యూజిలాండ్కు అడ్వాంటేజ్ అవుతుందని కిరణ్ మోరె అభిప్రాయపడ్డాడు. 'డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు ఇంగ్లండ్తో ఆడుతున్న రెండు టెస్ట్ల సిరీస్ న్యూజిలాండ్కు అడ్వాంటేజ్ అవుతుంది. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతున్న కోహ్లీసేనకు ఇది చేటు చేయనుంది. గత కొన్ని రోజులుగా క్వారంటైన్లో ఉంటున్న టీమిండియా ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ పెద్ద సవాలే. విజయవకాశాలు న్యూజిలాండ్కే ఎక్కువగా ఉన్నాయి. భారత్కు అంత సులువైన విషయం కాదు. కానీ ఈ సమస్యలను భారత ఆటగాళ్లు అధిగమిస్తారని భావిస్తున్నా'అని కిరణ్ మోరె చెప్పుకొచ్చాడు.

ఫ్యూచర్ కెప్టెన్..
'రిషభ్ పంత్.. భవిష్యత్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పంత్కు ఉన్నాయి. అతని కెరీర్ను ఓసారి పరిశీలిస్తే ప్రారంభంలో చాలా ఒడిదొడుకులు కనిపిస్తాయి. మొదట్లో అతను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల వల్లే అతను మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తొలుత ప్రపంచకప్కు ఎంపిక కాలేదు. టీ20లతో పాటు వన్డేలకూ జట్టులోకి తీసుకోలేదు. కానీ, అతను అనూహ్యంగా టెస్టు ఫార్మాట్ ద్వారా జట్టులోకి వచ్చాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.'అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.

దుమ్మురేపుతున్న పంత్..
కెరీర్లో ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసంతో రిషభ్ పంత్ కనిపిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను విజయవంతంగా ముందుకు నడిపించాడు. సారథిగా విజయాలు అందించాడు. అంతకుముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీసులో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాలో ఏకంగా సిరీస్ విజయాన్నే అంందించి చరిత్ర సృష్టించాడు. టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో అతను ఇదే ఫామ్ను కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications