
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఏ మాత్రం ఊహించని రీతిలో ఘోర పరాజయాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. 15 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఎన్నడూలేనంత చెత్త ప్రదర్శన ఈ సీజన్లోనే చేసింది. దీంతో ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు మాత్రమే విజయాలే సాధించి 10 ఓటములు చవిచూసింది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి అందరికన్నా ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే, తాజాగా ఈ దారుణ ప్రదర్శనపై ఆ జట్టు కీలక ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగపూరిత పోస్టు షేర్ చేశాడు. ఈ వైఫల్యం తమని ఘోరంగా బాధించినా ఒక జట్టుగా తమ స్ఫూర్తిని దెబ్బతీయలేదని పేర్కొన్నాడు. 'ఒకసారి ఈ సీజన్ను వెనక్కి తిరిగి చూస్తే ఒక జట్టుగా, వ్యక్తిగతంగా ఈ ఓటమి మా మనసులను ఎంతగా బాధించిందో మాకు మాత్రమే తెలుసు. అయితే, అది మా జట్టు స్ఫూర్తిని మాత్రం దెబ్బతీయలేదు. ఈ సీజన్లో మా జట్టులోని ప్రతి ఒక్కరూ ఎంతో నిబద్ధతతో ఆడారు. అయినా, దీని నుంచి మేం కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటాం.
ఈ ప్రదర్శన ఒక్కటే మమ్మల్ని, మా జట్టును అంచనా వేయడానికి పనికొస్తుందా అంటే..? కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. మేం ఇప్పటికీ తల ఎత్తుకొనే ముందుకు వెళ్తాం. ఎందుకంటే పరిస్థితుల్ని మార్చి చూపించే అవకాశం మాకింకా ఉందనే నమ్ముతున్నాం' అని పోలార్డ్ తన పోస్టులో పేర్కొన్నాడు.
ఈ సీజన్లో కీరన్ పొలార్డ్ దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ల్లో 14.40 సగటుతో 144 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్లో నాలుగు వికెట్లు మాత్రమే తీసింది.