అంతన్నారు.. ఇంతన్నారు.. కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు.. ఆరెంజ్ అంటే ఓ రేంజిలో ఉంటదని డీజేలు పెట్టారు.. జేజేలు కొట్టారు. అన్నట్టే తొలి మ్యాచే రాజస్థాన్ రాయల్స్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. దాంతో 300 పక్కా అంటూ బాకాలు కొట్టారు. అంతే..! ఖతం..టాటా.. గుడ్ బై!
పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్లు వరుస పరాజయాలతో ఒక్కసారిగా కిందపడిపోయారు. బస్.. ఆ తర్వాత ఇక పుంజుకోలేకపోయారు.. ముక్కీ మూలిగీ మూడు గెలిచారు. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని.. అస్సాం రైలెక్కారు. కనీసం అభిమానుల మనసులు గెలుచుకోలేకపోయారు. కూకట్పల్లి క్లాసెన్.. హయత్ నగర్ హెడ్.. అంబర్ పేట్ అభిషేక్ ..నిప్పులాంటి నితీష్ రెడ్డి..ఎవరూ ఏం చేయలేకపోయారు. ఆరెంజ్ ఆర్మీ ఆట ఏ రేంజ్లోనూ సాగలేదు.
పాపం కావ్య మారన్.. వీళ్ల ఆటను చూసి సిగ్గు పడింది. అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. కాటేరమ్మ కొడుకులు కాదు.. పోలేరమ్మ మనుమలు కాదు.. అంతా శాతగాని కొడుకులంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.!

ఐపీఎల్ 2025 సీజన్లో డిఫెండింగ్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సరిగ్గా సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయానికి భారీ వర్షం రావడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోయినా.. మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దాంతో కాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నిర్ణయంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరయ్యాయి.
ఈ మ్యాచ్ గెలిచి ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్కు కాస్తో కూస్తో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండేవి. వర్షం కారణంగా రద్దవ్వడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఓ పాయింట్ చేరింది. దాంతో 11 మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీ మూడు విజయాలతో 7 పాయింట్స్తో 8వ స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచ్లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 13 పాయింట్స్ చేరుతాయి. సన్రైజర్స్ పేలవ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నెక్ట్ సీజన్కు బెటర్ లక్ చెబుతున్నారు..!