తండ్రి చేసిన తప్పిదంతో టీమిండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ వేటుకు గురైంది. ముంబైలోని పురాతన క్లబ్ ఖార్ జింఖానా జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. జెమీమా సభ్యత్వాన్ని ఉపయోగించుకొని ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ క్లబ్ నిబంధనలు అతిక్రమించాడని, మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించుకున్నాడని క్లబ్ అధికారు తెలిపారు.
బలవంతంగా మతం మార్చేందుకు ఇవాన్ రోడ్రిగ్స్ క్లబ్ వేదికగా పలు కార్యక్రమాలు చేపట్టారని ఆరోపించారు. ఇవాన్ రోడ్రిగ్స్పై అనేక ఫిర్యాదులు అందాయని, దాంతో ఆదివారం జరిగిన క్లబ్ వార్షిక సమావేశంలో జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై జెమీమాకు పూర్తి సమాచారం అందించామని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై ఖార్ జింఖానా క్లబ్ ప్రెసిడెంట్ వివేక్ దేవ్నానీ ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడారు. 'జెమీమాకు ఈ క్లబ్లో మూడేళ్ల గడువు కలిగిన సభ్యత్వాన్ని ఇచ్చాం. కానీ ఆమె తండ్రి అనైతిక చర్యల వల్ల అక్టోబర్ 20నే ఆమె సభ్యత్వం రద్దు చేశాం. జెమీమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు.
ఏడాదిన్నర కాలంలో 35 కార్యక్రమాల కోసం క్లబ్లోని రాష్ట్రపతి భవన్ను బుక్ చేసారు. అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖరీదైన సంగీత పరికరాల, బిగ్ స్క్రీన్స్తో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఖర్ జింఖానా క్లబ్ నిబంధనల ప్రకారం ఇలాంటి మతపరమైన పనులు చేయడానికి వీలు లేదు'అని అన్నారు.
భారత్ తరఫున 3 టెస్ట్లు, 30 వన్డేలు, 104 టీ20లు ఆడిన జెమీమా రోడ్రిగ్స్.. మూడు ఫార్మాట్లలో కలిపి 3వేలకు పైగా పరుగులు చేసింది. ఇందులో 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జెమీమా తండ్రిని మీడియా వివరణ కోరగా.. మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.