|
యువీ బాగానే ఉన్నావా?:
చెల్సీకి వీరాభిమాని అయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్.. మాంచెస్టర్ అభిమాని అయిన యువరాజ్ సింగ్ను ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేశాడు. 'హాయ్ యువరాజ్.. నువ్వు బాగానే ఉన్నావా?' అని పీటర్సన్ సరదాగా యువీని అడిగాడు. కేపీ ట్వీట్పై స్పందించిన యువీ.. 'లేదు పీటర్సన్.. నేను అస్సలు బాలేను. చాలా బాధగా ఉంది' అని బదులిచ్చాడు. యువీ, కేపీ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.
అంత తేలిగ్గా వదిలిపెట్టం:
కెవిన్ పీటర్సన్ మళ్లీ మరో ట్వీట్ చేసి.. 'మాములుగానే నిన్ను చెక్ చేస్తున్నా. కొన్ని వారాల క్రితం మనం చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా నీకు మాట్లాడాలని ఉందా?. నువ్వు త్వరగా ఆ బాధలో నుంచి బయటపడాలని ఆశిస్తున్నా. ఎప్పుడైనా అతిథిగా వచ్చి నాతో పాటు ఛాంపియన్స్ లీగ్ చూడొచ్చు' అని పేర్కొన్నాడు. ఇది చూసిన యువీ.. 'చూద్దాం.. మేం ఎప్పుడూ అంత తేలిగ్గా వదిలిపెట్టం' అని మాంచెస్టర్ యునైటెడ్ జట్టును ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ సంభాషణ నెట్టింట్లో వైరల్ అయింది.
కౌంటర్లు వేసుకోవడం ఇదే తొలిసారి కాదు:
యువీ, కేపీ ఇలా ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పీటర్సన్ చెల్సీయా జట్టుకు అభిమాని కావడంతో గతంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఇదివరకు ప్రీమియర్ లీగ్లో మాంచెస్టర్ జట్టు న్యూకాజిల్ జట్టు చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం యువరాజ్ తన ట్విట్టర్లో 'కఠిన సమయం ఎప్పుడూ ఉండదు. కఠినమైన మనుషులు ఉంటారు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ పీటర్సన్ స్పదించాడు. 'మాంచెస్టర్లో ఎవరూ కఠినంగా లేరు' అంటూ యువరాజ్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కామెంట్ చేశాడు.
యువీ కీలక పాత్ర:
2019 జూన్ 10న యువరాజ్ సింగ్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్గా.. ఆల్రౌండర్గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
'రోహిత్కు అతిపెద్ద బలం అదే.. అందుకే సునాయాసంగా డబుల్ సెంచరీలు చేస్తున్నాడు'