
లండన్: కరోనాతో ప్రపంచం స్థంభించింది. ఈ మహమ్మారి దెబ్బకు అన్నీ రంగాలు అతలాకుతలమయ్యాయి. ఆటలైతే ఆగమాగమయ్యాయి. భారత్లో చాపకింద నీరులా ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు 200కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు క్రికెటర్లు నడుంబిగించారు. ఇప్పటికే భారత ఆటగాళ్లంతా స్వీయ నిర్భంధంలో ఉండాలంటూ.. జాగ్రత్తలు పాటించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే ఇండియాపై అమితమైన ప్రేమను కనబర్చే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నమస్తే ఇండియా అంటూ హిందీలో పలు సూచనలు చేశాడు. తనదైన శైలిలో వైవిధ్యంగా ఉండటంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇంతకీ ఈ ఇంగ్లీష్ మాజీ ఆటగాడు హిందీలో ఏం చెప్పాడంటే...? 'నమస్తే ఇండియా మనమందరం కరోనా వైరస్ను ఓడించడానికి కలిసికట్టుగా ఉందాం. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలను తప్పకుండా పాటిద్దాం. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నిద్దాం. ఇలాంటి క్లిష్ట సమయంలోనే మనమంతా అప్రమత్తంగా ఉండాలి'అని సూచించాడు. ఇంతలా తనకు హిందీ నేర్పించిన శ్రీవత్స గోస్వామి అనే వ్యక్తికి పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక, పీటర్సన్ ట్వీట్పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.