న్యూఢిల్లీ: టీమిండియా మాజీకెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో పదేళ్ల పాటు ఆడగలడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో కొత్తగా ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై వేదికగా చివరి మ్యాచ్ ఆడిన సీఎస్కే.. అనంతరం తమ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది.
మైదానంలో పరేడ్ నిర్వహించింది. ఫ్రాంచైజీ టీషర్ట్స్, టెన్నిస్ బాల్స్, రాకెట్స్ను గ్యాలరీలోకి విసిరేస్తూ వారికి బహుమతులు అందజేసింది. ఈ హడావుడి చూసి అంతా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని భావించారు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం పరుగెత్తి మరీ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దాంతో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడనే ప్రచారం ఊపందుకుంది.

అదే మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన కెవిన్ పీటర్సన్ మాత్రం ధోనీకి మరో పదేళ్ల పాటు ఆడే సత్తా ఉందని, ఇదే అతని చివరి సీజన్ కాదని అభిప్రాయపడ్డాడు. ఓ వెబ్సైట్కు రాసిన కాలమ్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 'కొత్తగా వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. మరో పదేళ్లు ధోనీ ఆడగలడు. అతనికి వికెట్ల వెనుక కాచుకోగల ఫిట్నెస్ ఉంది. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకపోయినా.. చివర్లో దూకుడుగా సిక్స్లు కొట్టగల సత్తా ఉంది.
కేకేఆర్తో మ్యాచ్ అనంతరం ధోనీకి లభించిన గౌరవం అద్భుతమనిపించింది. నేను అక్కడే ఉన్నా. మైదానం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ధోనీకి ఇదే చివరి సీజన్ అయితే నేను ఆశ్చర్యపోతా. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి బాగా ఉపయోగపడుతుంది. 20 ఓవర్ల పాటు కీపింగ్ చేయడంతో పాటు నచ్చిన స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు.

కెప్టెన్గా అతని నిర్ణయాలు జట్టును మెరుగుపరుస్తాయి. అతని కీపింగ్ అద్భుతం. టాపార్డర్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. 7, 8 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి కొన్ని బంతులను మాత్రమే ఆడవచ్చు. అలాగే 8-9 నెలలపాటు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అతని మొకాలి గాయం కూడా నయం చేసుకోవచ్చు. ఈ సీజనే అతనికి చివరిది కాదని నేను అనుకుంటున్నా. దేశంలో ప్రతీ ఒక్కరు ధోనీ మరో సీజన్ ఆడాలనుకుంటున్నారు.'అని పీటర్సన్ రాసుకొచ్చాడు.