
లండన్: ఐపీఎల్-2021లో మిగిలిన మ్యాచ్లకు ఇంగ్లండ్ సరైన వేదిక అని ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. వీలైతే సెప్టెంబర్లో మ్యాచ్ల నిర్వహణకు బీసీసీఐ సిద్దం కావాలని విజ్ఞప్తి చేశాడు. అప్పుడు యూకేలో వాతావరణం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ కచ్చితంగా ఖాళీ విండో లభిస్తుందని, ఈ విషయం గురించి యూకేలోనూ చర్చించుకుంటున్నారన్నాడు. టీమిండియా ప్లేయర్లు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఫారిన్ క్రికెటర్లు సులువుగా ఇక్కడికి వచ్చేస్తారని తెలిపాడు.
'సెప్టెంబర్ చివర్లో ఐపీఎల్ నిర్వహించేందుకు యూఏఈ సరైన వేదిక అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లండ్లో వాతావరణం చాలా బాగుంటుంది. మాంచెస్టర్, లీడ్స్, బర్మింగ్హామ్, లార్డ్స్, ఓవల్ మైదానాలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులను కూడా అనుమతిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్ ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికాలలో జరిగింది కాబట్టి ఈసారి ఇంగ్లండ్లో నిర్వహిస్తే బాగుంటుంది. ఒక్కసారి భారత్, ఇంగ్లండ్ సిరీస్ ముగిసిందంటే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అక్కడే అందుబాటులో ఉంటారు కూడా' అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంకలో అవకాశం ఉందా?
ఐపీఎల్ను తమ దేశంలో నిర్వహించేందుకు గత ఏడాది కూడా తీవ్రంగా ప్రయత్నించి శ్రీలంక క్రికెట్ బోర్డు విఫలమైంది. ఈసారైనా మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని ఆసక్తిగా ఉంది. అధికారికంగా బీసీసీఐకి ఇంకా ఎలాంటి విజ్ఞప్తి చేయకపోయినా... బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ అర్జున డిసిల్వా మాత్రం తాము సెప్టెంబర్లో నిర్వహించగలమని నమ్మకంగా చెబుతున్నాడు.
ప్రస్తుతం శ్రీలంకతో లీగ్ టోర్నీ నిర్వహణకు అవసరమైన ఫ్లడ్లైటింగ్తో నాలుగు మైదానాలు (ఖెట్టరమా, పల్లెకెలె, సూర్యవేవా, దంబుల్లా) అందుబాటులో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇటీవలే లంకలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూలాంశం. నెలరోజుల క్రితం అక్కడ రోజుకు 300 కేసులు రాగా... ఇప్పుడు రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి.