తమ టీమ్ కాంబినేషన్లో చోటు లేకపోవడంతోనే టీ నటరాజన్ను ఆడించడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 10.75 కోట్లు భారీ ధర పెట్టి నటరాజన్ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. నటరాజన్కు బదులు ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత్ చమీరాలను ఆడిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముఖేష్ కుమార్ వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కెవిన్ పీటర్సన్ను నటరాజన్ గురించి ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. తుది జట్టులో నటరాజన్ను ఎవరి ప్లేస్లో ఆడించాలో చెప్పాలని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించాడు.

'తుది జట్టులో మేం 12 మంది ఆటగాళ్లను మాత్రమే ఆడించగలం. అందులో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్. ప్రస్తుత పరిస్థితుల్లో నటరాజన్ ఏ ప్లేస్లో ఆడించాలో చెప్పండి. మాకు సాయం చేసినవారు అవుతారు. నటరాజన్ టీమ్ అడిగిన ప్రతీది చేస్తున్నాడు. అతనే కాదు మా బెంచ్ ఆటగాళ్లంతా జట్టు కోసం తమ వంతు చేయాల్సింది చేస్తున్నారు. తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు.
వేలంలో ఎంత డబ్బు ఖర్చు చేశామనేది అనవసరం. ఈ టోర్నీ పూర్తి డబ్బు మయంగా మారింది. ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్లో ఇలా డబ్బుల గురించి మాట్లాడరు. ఆటగాడి అవసరం ఉంటే తుది జట్టులోకి తీసుకుంటాం. ప్రస్తుతం మేం మంచి స్థితిలో ఉన్నాం. జేక్ ఫ్రెజర్ బయటికి వెళ్తే ఫాఫ్ డుప్లెసిస్ జట్టులోకి వచ్చాడు. నట్టూ అవసరం ఉంటే ఖచ్చితంగా జట్టులోకి తీసుకుంటాం.'అని కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు.
గత సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన నటరాజన్.. యార్కర్ల స్పెషలిస్ట్గా గుర్తింపు పొందాడు. 2020 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన నటరాజన్.. ప్రతీ సీజన్లో సత్తా చాటాడు. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో నట్టూ కీలక పాత్ర పోషించాడు. అయినా అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ రిటైన్ చేసుకోలేదు. వేలంలో భారీ ధర పలకడంతో వెనక్కి తగ్గింది. ఇప్పటి వరకు 61 మ్యాచ్లు ఆడిన నటరాజన్ 67 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా అతనికి పేరుంది.