
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ టైటిల్ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కామెంట్రీ చెప్పేందుకు దుబాయ్ చేరుకున్న ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇటీవల ముగిసిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇంత కాలం బయో బబుల్లోనే ఉన్న అతను... ఐపీఎల్ కోసం దుబాయ్ వేదికగా ఏర్పాటు చేసిన బయో బబుల్లో ప్రవేశించాడు. ఈ విషయాన్నే ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. 'బ్రిటన్లోని బయో బబుల్ నుంచి దుబాయ్లోని బయో బబుల్లోకి వచ్చేశా. క్రికెట్ మళ్లీ జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్ టీ20కి పనిచేయడం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ సీజన్ టైటిల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నేనైతే ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటున్నా!' అని పీటర్సన్ కాఫీ తాగుతున్న ఓ ఫొటోకు క్యాప్షన్గా పేర్కొన్నాడు.
ఇక పీటర్సన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, రైజింగ్ పుణే జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. సౌతాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్.. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు, 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు చేశాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక కామెంటేటర్గా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.
కరోనా కారణంగా యూఏఈకి తరలి వెళ్లిన ఐపీఎల్ 2020 సీజన్.. మరో 6 రోజుల్లో ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లీగ్ జరుగుతుండటంతో అన్ని జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. రికీ పాంటింగ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతుంది.