
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ క్షేమం కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం తనకు సంతోషాన్నిచ్చిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. భారత్- పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగపడితే తన కల నేరవేరినట్టేనని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ట్వీట్ చేశాడు. 'ఇమ్రాన్ ఖాన్ క్షేమం కోరుతూ నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం నా ముఖంలో చిరునవ్వును తెప్పించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షి సంబంధాలు మెరుగపడి ఒక్కటైతే నా కల నేరవేరినట్టే. మనందరం ఒకరికొకరం అండగా ఉండటం చాలా ముఖ్యం. అది ఈ ఏడాది ప్రతి ఒక్కరికి తెలుసొచ్చింది'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక కరోనా వైరస్ బారిన పడిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 'ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను'' అని మోదీ ట్వీట్ చేశాడు. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కోవిడ్ టీకా వేయించుకున్న రెండు రోజుల తర్వాత కరోనా వైరస్ రావడం చర్చనీయాంశమైంది. ఆయనకు పెద్దగా లక్షణాలు లేవని, స్వల్ప దగ్గు, జ్వరం మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి పైసల్ సుల్తాన్ తెలిపారు.
పాక్ ప్రధాని క్షేమం కోరుతూ భారత ప్రధాని ట్వీట్ చేసిన మూడు రోజుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరుగుతాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 2021 సెకండాఫ్లో రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగే అవకాశాలున్నట్లు పాకిస్థాన్కు చెందిన స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాదిలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లు ప్రచారం జరుగుతుంది.