ఇంగ్లండ్తో నాలుగో టీ20లో టీమిండియా తొండాట ఆడి గెలిచిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారని ప్రశ్నించాడు. కంకషన్ రూల్స్కు విరుద్దంగా హర్షిత్ రాణాను బరిలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్లో శివమ్ దూబే కంకషన్ గాయానికి గురవ్వడంతో అతని స్థానంలో సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. అనూహ్య రీతిలో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో 3 కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారని మాజీ క్రికెటర్లు, ఇంగ్లండ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఐసీసీ రూల్ 1.2.7.3.4 ప్రకారం.. కంకషన్ గాయానికి గురైన ఆటగాడి స్థానంలో అతనికి సరిపోయే ప్లేయర్ను మాత్రమే బరిలోకి దించాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివమ్ దూబే స్థానంలో మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ను ఆడించాల్సి ఉంది. కానీ భారత్ హర్షిత్ రాణాను ఆడించడం వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న కెవిన్ పీటర్సన్, హర్షా భోగ్లే కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ మ్యాచ్లో టీమిండియా 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగి విజయం సాధించిందని కెవిన్ పీటర్సన్ విమర్శించాడు.
'సరైన కంకషన్ సబ్స్టిట్యూషన్ను దించలేదనే అసహనంతోనే జోస్ బట్లర్ ఔటయ్యాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి. శివమ్ దూబేకు హర్షిత్ రాణా సరైన కంకషన్ సబ్స్టిట్యూట్ ప్లేయరా? ఎవరూ కూడా అవునని చెబుతారాని నేను అనుకోవడం లేదు. అతను వికెట్లు తీస్తే ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

సరైన రిప్లేస్మెంట్ కదా? అనేది వేరే నిర్ణయం. కానీ అతను విజయంలో కీలక పాత్ర పోషిస్తే మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది.'అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. పీటర్సన్ అన్నట్లుగానే హర్షిత్ రాణా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించిన పీటర్సన్.. ఇది అన్యాయమని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇది ఏ మాత్రం సరైన సబ్స్టిట్యూట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. 'శివమ్ దూబే వేగంగా బంతులు వేసినా.. హర్షిత్ రాణా బ్యాటింగ్ మెరుగుపరుచుకున్నా ఇదంతా ఆటలో భాగం. అయితే ఈ మ్యాచ్లో మేం గెలవాల్సింది. ఈ నిర్ణయాన్ని మేం ఏ మాత్రం అంగీకరించడం లేదు.'అని బట్లర్ చెప్పుకొచ్చాడు.