ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇంగ్లండ్ పర్యటన ఆరంభం నుంచే కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నా.. బ్యాటింగ్ డెప్త్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని ఆడించడం లేదు. తొలి టెస్ట్లో ఓడిన టీమిండియా రెండో టెస్ట్లో గెలిచి ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్లోనైనా కుల్దీప్ యాదవ్ను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
ఎడ్జ్బాస్టన్లో టీమిండియా గెలిచినా.. బౌలింగ్లో వేరియేషన్ మిస్సైందని, కుల్దీప్ను తీసుకుంటే జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి రెండు టెస్ట్లు ఆడిన జడేజా బ్యాట్తో రాణించినా.. బౌలింగ్లో విఫలమయ్యాడు. రెండో టెస్ట్ వాషింగ్టన్ సుందర్ సైతం బ్యాట్తో రాణించినా బంతితో చేతులెత్తేసాడు. ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అయిన కుల్దీప్ యాదవ్ తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా కుల్దీప్ యాదవ్ను ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.

'కుల్దీప్ యాదవ్ను ఆడించడం టీమిండియాకు ముఖ్యం. ఈ సిరీస్లో భారత్ ఒక మ్యాచ్ ఓడి.. మరో మ్యాచ్ గెలిచింది. అయితే ఆ జట్టు బౌలింగ్లో కొంత వేరియేషన్ మిస్సైంది. ముఖ్యంగా స్పిన్నర్లు వికెట్లు తీయలేక తడబడ్డారు. ఆ సమస్యను కుల్దీప్ యాదవ్తో అధిగమించవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా కుల్దీప్ యాదవ్తో నేను చాలా సమయం గడిపాను. ఇంగ్లండ్ కండిషన్స్లో బౌలింగ్ చేయడం గురించి సుదీర్ఘంగా చర్చించాను. వ్యూహాల గురించి చెప్పాను. ఎలా, ఎక్కడ బౌలింగ్ చేయాలనే విషయంపై కూడా మాట్లాడాను. అతను ఆడితే బాగుంటుంది. అతనికి బౌలింగ్ చేయడం.. వికెట్లు తీయడం అంటే చాలా ఇష్టం. నా ఆటగాళ్లు ఆడాలని నేను కోరుకుంటా. వారు బెంచ్పై కూర్చోవడం నాకు నచ్చదు.'అని కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.