
దుబాయ్: ముంబై ఇండియన్స్ తాత్కలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ చేసిన తప్పిదాలతోనే ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై 20 పరుగుల తేడాతో చిత్తయింది. మ్యాచ్ ఆరంభంలో సూపర్ బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ను వణికించిన ముంబై.. ఆ తర్వాత పేలవమైన ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన పీటర్సన్ ఇన్నింగ్స్ బ్రేక్లో పొలార్డ్ తప్పిదాలను పాయింట్ ఔట్ చేశాడు.
'ముంబై మ్యాచ్ను ఘనంగా ఆరంభించింది. ప్రారంభంలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత శర్మ దూరమైనప్పటికీ.. ఆ ఒత్తిడిని జయించి శుభారంభం చేసింది. ముంబై బౌలర్ల ధాటికి పవర్ప్లే ముగిసేసరికి సీఎస్కే కీలక నాలుగు వికెట్లు కోల్పోవడంతో రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగా అంబటి రాయుడు సేవలను కోల్పోయింది. ఇలా టాప్-5 బ్యాట్స్మన్ పెవిలియన్ చేరిన వేళ ఆ అవకాశాన్ని ముంబై అందిపుచ్చుకోలేకపోయింది. ముంబై తాత్కలిక సారథి కీరన్ పొలార్డ్ ఆ ట్రిక్ను మిస్సయ్యాడు. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్మన్పై మరింత ఒత్తిడి పెంచేలా జస్ప్రీత్ బుమ్రాతో 2-3 ఓవర్లు బౌలింగ్ చేయించాల్సింది. అలా చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా 40 లేదా 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఉండేది. 60, 70 లేదంటే 80 పరుగులకే ఆలౌటయ్యేది. నేనేమీ ఇదంతా ఊరికే ఏం చెప్పడం లేదు. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్మెన్ను ఔట్ చేసేందుకు స్టార్ బౌలర్లను బరిలోకి దించాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి''అని పీటరన్స్ అభిప్రాయపడ్డాడు.

24 పరుగులకే ఐదుగురు బ్యాట్స్మెన్ సేవలను కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(33 బంతుల్లో 26; 1 ఫోర్) కలిసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. చివర్లో డ్వేన్ బ్రావో మెరుపులు కూడా తోడవడంతో దాంతో 100 పరుగుల్లోపే ప్యాకప్ అవుతుందనుకున్న చెన్నై.. 156 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే పవర్ ప్లేలో మిల్నే, బౌల్ట్తో బౌలింగ్ చేయించిన పొలార్డ్.. ఏడో ఓవర్ బుమ్రాకు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ 14వ ఓవర్ వరకు యార్కర్ల కింగ్కు బంతినివ్వలేదు. 16వ ఓవర్లో బంతిని అందించినా.. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న రుతురాజ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పరుగులు చేశాడు.ఈ తప్పిదమే ముంబై ఇండియన్స్ కొంపముంచింది. బుమ్రాతో ముందుగానే బౌలింగ్ చేయించి ఉంటే.. చెన్నై తక్కువ స్కోర్కే ఆలౌటయ్యేది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రుతురాజ్ గైక్వాడ్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్ చహర్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంకాగా. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.