ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు తమ అభిమానుల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీగా ఖర్చు చేసింది. ఫ్యాన్స్కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని రినోవేట్ చేసింది. ఇందు కోసం ఏకంగా రూ.10 కోట్ల సొంత నిధులను ఖర్చు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)తో పనిలేకుండా సొంత నిధులతో స్టేడియాన్ని పునరుద్దరించింది.
టాయిలెట్స్తో పాటు కార్పోరేట్ బాక్స్లు, లాంజ్ను రినోవేట్ చేసింది. ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీనే సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించింది. స్టేడియం రినోవేషన్ పనులకు సంబంధించిన వీడియోను పంచుకుంది.
'ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ గ్రూప్.. సుమారు రూ.10 కోట్లతో స్టేడియం రినోవేషన్ పనులను చేపట్టింది. స్టేడియంలో 42 టాయిలెట్స్, లాంజ్తో సహా 42 బాక్సులను పూర్తిగా రినోవేట్ చేసి సరికొత్తగా తీర్చిదిద్దారు. వీటితో పాటు స్టేడియంలో కొత్తగా రెండు ఎలివేటర్లు(లిఫ్టులు), 43 ఎయిర్ కండిషనర్లను కూడా ఏర్పాటు చేశారు.'అని పేర్కొంది.

గతేడాది కూడా సన్రైజర్స్ మేనేజ్మెంట్ రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసింది. అయితే అప్పటి హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు పూర్తిగా తామే స్టేడియాన్ని పునరుద్దరించామని మీడియాకు చెప్పి క్రెడిట్ కొట్టేసారు. ఈ వ్యవహారంలో సన్రైజర్స్ మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురైంది. ఈ గొడవ కాస్త పెద్దదై.. టికెట్ల వివాదానికి దారి తీసింది. ఇది కాస్త సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్లింది. ప్రభుత్వం విచారణకు ఆదేశించగా..జగన్మోహన్ రావు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
ఒకప్పుడు ఉప్పల్ స్టేడియం దారుణంగా ఉండేది. కనీసం కేనోపిలు కూడా ఉండేవి కావు. సీట్లన్నీ కాకిరెట్టలతో నిండిపోయి ఉండేవి. కానీ వన్డే ప్రపంచకప్ 2023 సమయంలో బీసీసీఐ నిధులతో స్టేడియాన్ని కొంత వరకు పునరుద్దరించగా.. గతేడాది హెచ్సీఏ, సన్రైజర్స్ హైదరాబాద్ సంయుక్తంగా మరింత అందంగా మార్చాయి. ఈ సారి సన్ గ్రూప్.. స్టేడియంలో లోపాలు లేకుండా రినోవేట్ చేసింది. అభిమానుల సౌకర్యాల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ రూ.10 కోట్లు ఖర్చు పెట్టడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావ్య పాపనా మజాకా.. ఫ్యాన్స్ సౌకర్యాల కోసం ఏమైనా చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడనుంది.