ఐపీఎల్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మాస్టర్ ప్లాన్ రచించింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం పాత ఐపీఎల్ రూల్ను మళ్లీ తీసుకురావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని కోరింది.
ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో 10 ఫ్రాంచైజీల ఓనర్లతో బుధవారం బీసీసీఐ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే ముందు ఫ్రాంచైజీల సలహాలు, సూచనలను తీసుకుంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ గురించి ఫ్రాంచైజీల అభిప్రాయాలను తెలుసుకుంది.

ఈ విషయంలో ఫ్రాంచైజీలు రెండుగా విడిపోయినట్లు తెలుస్తోంది. సగం టీమ్స్ మెగా వేలం వద్దంటే.. మరొకొన్ని టీమ్స్ పెట్టాలని డిమాండ్ చేశాయి. ఇంపాక్ట్ రూల్ కొనసాగించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో లీగ్కు దూరమయ్యే ఓవర్సీస్ ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐని 10 ఫ్రాంచైజీలు కోరాయి.
ధోనీ కోసం సీఎస్కే ఓ పాత రూల్ను మళ్లీ తీసుకురావాలని కోరినట్లు తెలుస్తోంది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఐదేళ్లు పూర్తవ్వడంతో అతన్ని అనామక ఆటగాడిగా పరిగణించాలని సీఎస్కే సూచిస్తోంది. ఐపీఎల్ 2008 నుంచి 2021 వరకు ఈ రూల్ను అమలు చేశారని, మరోసారి ఈ నిబంధనను అమలు చేయాలని బీసీసీఐ అధికారులను కోరింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఐదు సంవత్సరాలు పూర్తయిన ఆటగాళ్లను అనామక ఆటగాళ్లుగా పరిగణించేవారు. 2008 నుంచి 2021 వరకు ఈ నిబంధనను అమలు చేశారు.
ధోనీ కోసం మరోసారి ఈరూల్ను పెట్టాలని సీఎస్కే సూచించగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ రూల్ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఒప్పుకోమని స్పష్టం చేసింది. ఈ రూల్ వల్ల దిగ్గజ ఆటగాళ్ల విలువను తగ్గించినట్లు అవుతుందని, గొప్ప ఆటగాడైన ధోనీ వేలంలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఓ అనామక ఆటగాడిని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసి.. ధోనీ తక్కువ ధరకు రిటైన్ చేసుకోవడం ఏ మాత్రం భావ్యం కాదని అభిప్రాయపడింది. ఐపీఎల్ 2022 మెగా వేలం రూల్స్ ప్రకారం అనామక ప్లేయర్ రిటెన్షన్ ప్రైజ్ రూ. 4 కోట్లుగా ఉంది. గత మూడు సీజన్లకు ధోనీ రూ. 12 కోట్లు తీసుకున్నాడు. ఒకవేళ అతను అనామక ప్లేయర్గా బరిలోకి దిగితే రూ. 5 కోట్ల కంటే తక్కువ డబ్బులనే తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రిటెన్షన్ రూల్స్ను బట్టి ఐపీఎల్ ఆడే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోనీ తెలిపాడు.