సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్లో ఓటమిపాలైంది. ఇక ముంబై కేప్టౌన్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ గెలవడంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశతో కనిపించే కావ్య మారన్.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో జట్టు విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎగిరి గంతేయడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. 'మా కావ్య పాప నవ్విందోచ్'అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టెర్న్ కేప్ టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోర్డాన్ హెర్మాన్(62 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 106 నాటౌట్) శతక్కొట్టగా.. డేవిడ్ మలాన్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో కీరన్ పోలార్డ్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై కేప్ టౌన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసి ఓటమిపాలైంది. ర్యాన్ రికెల్టన్(33 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కరణ్(22 బంతుల్లో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్మన్ 3 వికెట్లు తీయగా.. లియామ్ డాసన్, డానియల్ వోరాల్ తలో వికెట్ తీసారు.
చివరి ఓవర్లో ముంబై విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. బార్ట్మన్ వేసిన తొలి బంతిని ముంబై బ్యాటర్ కోన్నార్ భారీ సిక్సర్ బాదాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తర్వాతి బంతిని డాట్ చేసిన బార్ట్మన్ మూడో బంతికి సింగిల్ ఇచ్చాడు. నాలుగో బంతిని వైడ్గా వేయగా.. ఐదో బంతికి లెగ్బై రూపంలో సింగిల్ వచ్చింది.
మరసటి బంతికి కూడా సింగిల్ రావడంతో.. ఆఖరి బంతికి ముంబై విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. 4 కొటితే డ్రా.. సిక్స్ కొడితే విజయం. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ బార్ట్మన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ బంతిని డాట్ చేశాడు. దాంతో సన్రైజర్స్ ఫ్యాన్స్తో పాటు కావ్య మారన్ ఎగిరి గంతేశారు. అప్పటి వరకు నిశబ్దంగా ఉన్న మైదానం ఒక్కసారిగా అరుపులతో దద్దరిల్లింది.