ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు తొలి సారి ఫైనల్కు చేరింది. గురువారం వడోదర వేదికగా జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది. వడోదర కెప్టెన్ కరుణ్ నాయర్ మరోసారి సాధికారిక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 380 పరుగుల భారీ స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే విదర్భకు ఇది అత్యధిక స్కోర్ కావడం విశేషం. కరుణ్ నాయర్తో పాటు ఓపెనర్లు ధ్రువ్ షోరే(120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 114), యశ్ రాథోడ్(101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 116) శతకాలతో రాణించగా.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీయగా.. సత్యజీత్ బచ్చావ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(7) విఫలమవ్వగా.. మరో ఓపెనర్ అర్శిన్ కులకర్ణి(101 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 90) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అంకిత్ బావ్నె(49 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా..నిఖిల్ నాయక్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49) ఒక్క పరుగు తేడాతో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు.
విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే(3/64), నచికేత్ భుటే(3/68) మూడేసి వికెట్లతో రాణించగా.. పార్థ్ ఓ వికెట్ పడగొట్టాడు.
కరుణ్ నాయర్ ఊచకోత..
ఈ టోర్నీలో కరుణ్ నాయర్ అసాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లోనూ కరుణ్ నాయర్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్లతో మొత్తం 752 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 75.2గా నమోదైంది. ఈ ఏడు ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ ఏడు ఇన్నింగ్స్ల్లో అతను ఒక్కసారి మాత్రమే ఔటవ్వడం విశేషం. ఈ ప్రదర్శన నేపథ్యంలో కరుణ్ నాయర్ను భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
కర్ణాటకతో ఫైనల్..
తొలి సెమీఫైనల్లో హరియాణపై విజయం సాధించిన కర్ణాటకతో విదర్భ టైటిల్ పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్ వడోదర వేదికగా శనివారం జరగనుంది. విదర్భ సారథిగా కరుణ్ నాయర్ తన సొంతరాష్ట్రమైన కర్ణాటకతో తలపడనున్నాడు. తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంతో వడోదరకు మారిన కరుణ్ నాయర్ తన అసలు సిసలు సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఒంటిచేత్తో విదర్భను తొలిసారి ఫైనల్కు చేర్చాడు. ఇప్పుడు తన హోమ్ టీమ్పైనే ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తున్నాడు.