ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్ను టీమిండియా పేలవంగా ప్రారంభించింది. వర్షం అంతరాయం మధ్య వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్(52 బ్యాటింగ్)అజేయ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనికి వాషింగ్టన్ సుందర్(19 బ్యాటింగ్) అండగా నిలబడ్డాడు.
వర్షం అంతరాయం కారణంగా తొలి రోజు 64 ఓవర్ల ఆటనే సాధ్యమైంది. ఓవర్కాస్ట్ కండీషన్స్ మధ్య పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా మారింది. పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్ను ఇంగ్లండ్ బౌలర్లు అందిపుచ్చుకున్నారు. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. రెండో రోజు ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(2), కేఎల్ రాహుల్(14) పెవిలియన్ చేరారు. అట్కిన్సన్ బౌలింగ్లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపేసిన అంపైర్లు.. నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో భారత్ 23 ఓవర్లలో 72/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
గంట విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. ఆదిలోనే శుభ్మన్ గిల్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరోసారి వర్షం రావడంతో టీమిండియా 85/3 స్కోర్తో మైదానం వీడింది. వర్షం భారీగా పడటం, ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో దాదాపు రెండు గంటల పాటు ఆటకు అంతరాయం కలిగింది. దాంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.
ఆఖరి సెషన్లో టీమిండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్(38)ను జోష్ టంగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా(9) కూడా టంగ్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్(19)ను అట్కిన్సన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సుందర్, కరుణ్ నాయర్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 51 పరుగులు జోడించడంతో భారత్ 200 పరుగుల మార్క్ను ధాటింది.