సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ అసహనం వ్యక్తం చేశాడు. తాను జట్టులో ఉండి ఉంటే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ప్రస్తావన తీసుకురాకుండా పరోక్షంగా తన మనసులోని మాటను ట్వీట్ చేశాడు.
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 201 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(97 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 58), వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 48) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(10), రవీంద్ర జడేజా(6) తీవ్రంగా నిరాశపర్చారు. కుల్దీప్ యాదవ్(122 బంతుల్లో 3 ఫోర్లతో 19)తో కలిసి వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్కు నమోదైన 72 పరుగులు జోడించాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(6/48) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. సిమన్ హర్మర్(3/64) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్కు ఒక వికెట్ దక్కింది. దాంతో సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ తీరుపై కరుణ్ నాయర్ ఎక్స్వేదికగా స్పందించాడు. 'కొన్ని పరిస్థితులు మనసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో లేకపోతే మరింత బాధ కలుగుతుంది.'అని ట్వీట్ చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్.. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు మ్యాచ్ల్లో ఆడిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
దాంతో భారత జట్టులో అవకాశం కోల్పోయాడు. భారత జట్టులో చోటు కోల్పోయినా.. రంజీల్లో అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. కర్ణాటక తరఫున 5 మ్యాచ్లు ఆడి 100 సగటుతో 600 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ను సౌతాఫ్రికాతో సిరీస్కు ఎంపిక చేయాల్సిందనే అభిప్రాయం కలుగుతోంది.