టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత టెస్ట్ టీమ్లోకి వచ్చిన కరుణ్ నాయర్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ 0, 20 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు.
ఇంగ్లండ్తో బుధవారం ప్రారంభమైన రెండో టెస్ట్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్ మరోసారి విఫలమయ్యాడు. 50 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసిన కరుణ్ నాయర్.. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో టీమిండియా 98/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

వరుస వైఫల్యాల నేపథ్యంలో కరుణ్ నాయర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'డియర్ క్రికెట్.. ఒక్క ఛాన్స్ అంటూ' పోస్ట్ పెట్టిన కరుణ్ నాయర్.. మూడు అవకాశాలను వృథా చేసుకున్నాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఈ పర్యటనకు ముందు కరుణ్ నాయర్ 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు. 2016లో ఇంగ్లండ్తో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్తో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్.. అదే సిరీస్లో చెన్నై వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ(303 నాటౌట్) సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు.
ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. అయితే గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్.. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్'అంటూ అతను పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కానీ వచ్చిన అవకాశాలను కరుణ్ నాయర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని వైఫల్యం కారణంగా తొలి టెస్ట్లో టీమిండియా ఓటమిపాలైంది. తాజా రెండో టెస్ట్లో యశస్వి జైస్వాల్తో కీలక భాగస్వామ్యం నమోదు చేసినా.. భారీ స్కోర్ సాధించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో అతను రాణించకపోతే.. కరుణ్ నాయర్కు తుది జట్టులో చోటు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది. కరుణ్ నాయర్ కోసం సాయి సుదర్శన్ పక్కకు పెట్టారు. రెండో ఇన్నింగ్స్లో రాణించకపోతే.. కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ను తుది జట్టులోకి తీసుకొస్తారు.