ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్, టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ విధ్వంసం కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లోనూ కరుణ్ నాయర్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్లతో మొత్తం 752 పరుగులు చేశాడు.
అతని యావరేజ్ 75.2గా నమోదైంది. ఈ ఏడు ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ ఏడు ఇన్నింగ్స్ల్లో అతను ఒక్కసారి మాత్రమే ఔటవ్వడం విశేషం.

తాజాగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లోనూ కరుణ్ నాయర్ తన ఊచకోతను కొనసాగించాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 380 పరుగుల భారీ స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే విదర్భకు ఇది అత్యధిక స్కోర్ కావడం విశేషం.
కరుణ్ నాయర్తో పాటు ఓపెనర్లు ధ్రువ్ షోరే(120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 114), యశ్ రాథోడ్(101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 116) శతకాలతో రాణించగా.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ(33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీయగా.. సత్యజీత్ బచ్చావ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన మహారాష్ట్ర 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇక కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గతంతో భారత్ తరఫున అతను టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత అతనికి సరైన అవకాశాలు రాలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కరుణ్ నాయర్కు అవకాశం ఇవ్వకపోతే సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అతని సూపర్ ఫామ్ ఇప్పుడు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది.