ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ స్టార్, 11వ సీడ్ కరోలినా ముచోవా మైదానంలోనే కన్నీటి పర్యంతమైంది.ప్రేక్షకుల గ్యాలరీలో మాజీ ప్రియుడు కనిపించడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. గత గురువారం సోరానా క్రిస్టియానాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్లో తొలి సెట్లో ముచోవా 1-4తో వెనుకంజలో నిలిచిన సమయంలో అకస్మాత్తుగా సర్వ్ చేయకుండా ఆగిపోయింది. ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. ఆటను తిరిగి ప్రారంభించే ముందు చైర్ అంపైర్కు క్షమాపణలు కూడా చెప్పింది. ఈ అనూహ్య ఘటనతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముచోవా ఎందుకు ఏడ్చిందనేది తెలియక అయోమయానికి గురయ్యారు.

బాధను భరిస్తూనే ఆటను కొనసాగించిన ముచోవా అద్వితీయమైన ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది. 7-6, 6-7, 6-4 తేడాతో మూడు సెట్లను గెలుచుకుని ముందడుగువేసింది. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ముచోవా.. ఏడ్వడానికి గల కారణాన్ని వెల్లడించింది. తన మాజీ ప్రియుడు ప్రేక్షకుల మధ్య కూర్చుని ఉండటంతోనే భావోద్వేగానికి గురైనట్లు తెలిపింది.
'టెన్నిస్కు సంబంధించిన కారణం కాదు. నాకు ఎదురుగా నా మాజీ ప్రియుడు కూర్చున్నాడు. కొన్నిసార్లు అతను ఉండకూడని చోట కనిపిస్తాడు. నేను అతన్ని వెళ్ళిపోమని చెప్పాను. మొదట అతను వెళ్ళలేదు. కానీ తర్వాత నా బాధను చూడలేక వెళ్ళిపోయాడు. అతన్ని చూస్తూ ఆటపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించింది.'అని ముచోవా చెప్పుకొచ్చింది. ఈ టోర్నీలో ముచోవా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, రెండో రౌండ్లో సొరానా క్రిస్టియా, మూడో రౌండ్లో లిండా నోస్కోవా, నాలుగో రౌండ్లో మార్తా కోస్ట్యూక్ను ఓడించి టోర్నీలో ముందడుగు వేసింది.