ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట పాపం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)దే అని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. హై కోర్టుకు సమర్పించిన నివేదికలో ఆర్సీబీ బాధ్యతారాహిత్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ టైటిల్ సాధించడంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
బెంగళూరు నగరం వేదికగా నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం ముందు భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై కన్నెర్ర చేసిన కర్ణాటక హైకోర్టు సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజాగా ఈ ఘటనకు సంబంధించిన నివేదికను కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. అందులో సంచలన విషయాలను వెల్లడించింది. 'ఆర్సీబీ నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగింది. విజయోత్సవ వేడుకల విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏకపక్షంగా వ్యవహరించింది. పోలీసులను సంప్రదించకుండా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సోషల్ మీడియా వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగం కావాలని అభిమానులకు పిలుపునిచ్చింది.

ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియోలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వయంగా అభిమానులు విజయోత్సవ వేడుకల్లో భాగం కావాలని పిలుపునిచ్చాడు. ఈ పోస్ట్ను 44 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో కారణంగా సుమారు 2-3 లక్షల మంది అభిమానులు స్టేడియానికి వచ్చేలా చేసింది. చిన్నస్వామి స్టేడియం సీటింగ్ కెపాసిటీ 35 వేలు కాగా.. అభిమానులు లక్షల్లో తరలి వచ్చారు. గేట్ నంబర్ 1, 2, 21 వద్ద అభిమానులు గేట్లను బద్దలు కొట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.
ఆర్సీబీ మేనేజ్మెంట్తో పాటు ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) మధ్య సమన్వయం లేకపోవడమే ఈ దురదృష్టకర ఘటనకు కారణం. జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ప్రకారం స్టేడియం లోపల 79 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. బయట ఎవరూ లేరు. అంబులెన్స్లు కూడా ఘటన స్థలం వద్ద లేవు. పోలీస్ యంత్రాంగం వైఫల్యం కూడా ఉంది.'అని కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
ఈ రిపోర్ట్ను సీక్రెట్గా ఉంచేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని హైకోర్టు ఆదేశించడంతో.. ప్రభుత్వం సమర్పించిన వెంటనే బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. ఆర్సీబీ మేనేజర్, కేఎస్సీఏ అధికారులు, ఈవెంట్ మేనేజర్పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాట నేపథ్యంలో విజయోత్సవ వేడుకలపై బీసీసీఐ ఆంక్షలు విధించడంతో పాటు పలు గైడ్లైన్స్ జారీ చేసింది.