బెంగళూరు: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో ట్రోల్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ.. గంభీర్కు తనదైన శైలిలో చురకలంటించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలో మూతిపై వేలు వేసుకొని సైలెంట్గా ఉండాలని చెప్పారు.
ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా రాహుల్ గాంధీ ఈ సైగలు చేయడం చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానంతరం ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి గంభీర్ ష్.. గప్చుప్ అంటూ సైగలు చేసిన విషయం తెలిసిందే. తమది విజయమని, ఆర్సీబీ అభిమానులు గమ్మున ఉండాలని గంభీర్ చేసిన సైగలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

గంభీర్ చర్యలను మనసులో పెట్టుకున్న కోహ్లీ.. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ధీటుగా బదులిచ్చాడు. ఆర్సీబీ అభిమానులు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదని, వారికి తాను మద్దతుగా ఉంటానని సైగలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు ఈ మ్యాచ్లో గంభీర్-కోహ్లీ తీవ్రంగా గొడవపడ్డారు.
ఈ క్రమంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ.. గౌతమ్ గంభీర్కు తనదైన శైలిలో కౌంటరిచ్చారు. కర్ణాటక ప్రజలను సైలెంట్గా ఉండమని చెప్పినవారే ఇప్పుడు మౌనంగా ఉండాలని చురకలంటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ సందర్భంగా.. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయాన్ని బలవంతులపై బలహీనులు సాధించిన గెలుపుగా ఆయన అభివర్ణించారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తాము నిజాయతీతో, ప్రేమతో పోరాటం చేశామని దాన్ని ప్రజలు స్వీకరించి ఇంత పెద్ద విజయం అందించారని పేర్కొన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడిందని అన్నారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.