బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియాన్ని నగర శివార్లోకి తరలించే విషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం బటయ జరిగిన ఈ సంఘటనలో 11 మంది మృతి చెందడంతో పాటు మరో 50 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య.. నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియాన్ని శివార్లలోకి తరలించాలనుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణక్ష్ం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 'మా ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియాన్ని మరొక ప్రదేశానికి తరలించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. ఇలాంటి దురదృష్టకర ఘటన ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగకూడదు. ఈ సంఘటన వ్యక్తిగతంగా నన్ను కలిచి వేసింది. మా ప్రభుత్వానికి తీవ్ర బాధ కలిగించింది.

ఈ ఘటన విషయంలో మా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. మా తరఫున ఎటువంటి పొరపాటు జరగలేదు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై సస్పెన్షన్ విధించాం. తొక్కిసలాట జరిగిన రెండు గంటల తర్వాతే నాకు సమాచారం అందింది. తొక్కిసలాట మధ్యాహ్నం 3:50 గంటలకు జరిగితే, తనకు సాయంత్రం 5:45 గంటలకు నా దృష్టికి వచ్చింది.
నాకు విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులను అలర్ట్ చేయడంతో పాటు ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిసాను. విధానసౌధ ముందు నిర్వహించిన విజయోత్సవ వేడుకకు నన్ను ఆహ్వానించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘటనకు మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.'అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి టైటిల్ అందుకుంది. దాంతో బెంగళూరు వేదికగా ఘనంగా విజయోత్సవ వేడుకలను ఏర్పాటు చేసింది. కానీ భద్రతా వైఫల్యం కారణంగా 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆర్సీబీ విజయోత్సవం విషాదంగా ముగిసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లను అరెస్ట్ చేసింది.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లోనూ పలువురిపై వేటు పడింది. బెంగళూరు పోలీస్ కమిషనర్తో పాటు మరికొంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారంగా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 25 లక్షలకు పెంచింది.